సమూయేలు మాట ఇశ్రాయేలీయులందరికి వ్యాపించింది.
KO
Copywork
Telugu OTSA 사무엘상 4장
성경필사는 빠르게 끝내는 입력 훈련이 아니라, 한 절씩 말씀의 문장과 흐름을 다시 붙드는 시간입니다. 입력 내용은 이 브라우저에 임시 저장되며, 로그인하면 계정에도 저장됩니다.
소제목 단위로 진행 · 사무엘상
ఇశ్రాయేలీయుల మీదికి వెళ్లడానికి ఫిలిష్తీయులు తమ బలగాలను మోహరించారు. యుద్ధం ముమ్మరమైనప్పుడు ఫిలిష్తీయుల చేతిలో ఇశ్రాయేలీయులు ఓడిపోయి యుద్ధభూమిలోనే సుమారు నాలుగు వేలమంది మరణించారు.
సైనికులు శిబిరం దగ్గరకు తిరిగి వచ్చినప్పుడు, ఇశ్రాయేలీయుల పెద్దలు, “ఈ రోజు యెహోవా ఫిలిష్తీయుల ముందు ఎందుకు మనలను ఓడిపోయేలా చేశారు? మనం యెహోవా నిబంధన మందసాన్ని షిలోహులో నుండి తీసుకువద్దాం, అప్పుడు ఆయన మనతో వెళ్లి మన శత్రువుల చేతిలో నుండి మనలను రక్షిస్తారు” అని అన్నారు.
కాబట్టి ప్రజలు కొందరిని షిలోహుకు పంపించి అక్కడినుండి కెరూబుల మధ్య ఆసీనుడై ఉన్న సైన్యాల యెహోవా యొక్క నిబంధన మందసాన్ని తెప్పించారు. దేవుని నిబంధన మందసంతో పాటు ఏలీ యొక్క ఇద్దరు కుమారులైన హొఫ్నీ, ఫీనెహాసు అక్కడే ఉన్నారు.
యెహోవా నిబంధన మందసం శిబిరంలోనికి రాగానే ఇశ్రాయేలీయులందరు భూమి దద్దరిల్లేంత పెద్దగా కేకలు వేశారు.
ఆ కేకల ధ్వని ఫిలిష్తీయులు విని, “హెబ్రీయుల శిబిరంలో ఆ పెద్ద కేకలు ఏంటి?” అనుకున్నారు.
ఫిలిష్తీయులు భయపడి, “ఒక దేవుడు శిబిరంలోనికి వచ్చాడు; అయ్యో! ఇంతకుముందు ఎప్పుడూ ఇలా జరుగలేదు.
మనకు శ్రమ! బలాఢ్యుడైన ఈ దేవుని చేతిలో నుండి మనలను ఎవరు విడిపిస్తారు? అరణ్యంలో అనేక రకాల తెగుళ్ళతో ఈజిప్టువారిని నాశనం చేసిన దేవుడు ఈయనే.
ఫిలిష్తీయులారా, ధైర్యంగా ఉండండి! మగవారిగా ఉండండి, లేదా వారు మీకు బానిసలైనట్టు మీరు హెబ్రీయులకు బానిసలు కాకుండ మగవారిగా బలాఢ్యులై పోరాడండి!” అని చెప్పుకొన్నారు.
కాబట్టి ఫిలిష్తీయులు యుద్ధం చేశారు, ఇశ్రాయేలీయులు ఓడిపోయి అందరు తమ గుడారాలకు పారిపోయారు. అప్పుడు భయంకరమైన వధ జరిగింది; ఇశ్రాయేలీయులలో ముప్పైవేలమంది సైనికులు చనిపోయారు.
దేవుని మందసం స్వాధీనం చేసుకోబడింది, ఏలీ ఇద్దరు కుమారులైన హొఫ్నీ, ఫీనెహాసులు చనిపోయారు.
ఆ రోజే ఒక బెన్యామీనీయుడు యుద్ధభూమిలో నుండి పరుగెత్తుకుని వచ్చి చినిగిన బట్టలతో తలమీద దుమ్ముతో షిలోహులోనికి వచ్చాడు.
అతడు వచ్చేటప్పటికి, ఏలీ మార్గం ప్రక్కన తన కుర్చీలో చూస్తూ కూర్చున్నాడు, ఎందుకంటే అతని హృదయం దేవుని మందసాన్ని గురించిన భయంతో నిండింది. ఆ వ్యక్తి పట్టణంలోకి ప్రవేశించి జరిగిన విషయం చెప్పగానే పట్టణమంతా కేకలు వేసింది.
ఏలీ ఆ కేకలు విని, “ఈ కేకలకు అర్థమేంటి?” అని అడిగాడు.
ఏలీకి తొంభై ఎనిమిది సంవత్సరాల వయస్సు, అతనికి చూపు మందగించి చూడలేకపోయేవాడు.
అతడు ఏలీతో, “యుద్ధభూమి నుండి వచ్చినవాన్ని నేనే, ఈ రోజే నేను యుద్ధంలో నుండి పరుగెత్తుకొని వచ్చాను” అని చెప్పాడు.
అందుకు ఆ వార్త తెచ్చిన అతడు, “ఇశ్రాయేలీయులు ఫిలిష్తీయుల ముందు నిలబడలేక పారిపోయారు. సైన్యంలో అనేకమంది చంపబడ్డారు. నీ ఇద్దరు కుమారులైన హొఫ్నీ ఫీనెహాసులు కూడా చంపబడ్డారు. దేవుని మందసాన్ని శత్రువులు స్వాధీనం చేసుకున్నారు” అని చెప్పాడు.
దేవుని మందసం గురించి అతడు చెప్పగానే, ఏలీ గుమ్మం దగ్గర ఉన్న తన కుర్చీమీద నుండి వెనుకకు పడి మెడ విరిగి చనిపోయాడు. ఎందుకంటే అతడు ముసలివాడు, భారీకాయుడు. అతడు నలభై సంవత్సరాలు ఇశ్రాయేలీయులకు న్యాయాధిపతిగా ఉన్నాడు.
ఏలీ కోడలైన ఫీనెహాసు భార్య ప్రసవ సమయం దగ్గరపడిన గర్భవతి. దేవుని మందసాన్ని శత్రువులు స్వాధీనం చేసుకున్నారని, తన మామ, తన భర్త చనిపోయారని ఆమె విని, పురిటినొప్పులు వచ్చి, మోకాళ్లమీద కూలబడి ప్రసవించింది. ఆమె ఆ పురిటినొప్పులు తట్టుకోలేకపోయింది.
ఆమె చనిపోతుండగా, అక్కడ నిలబడి ఉన్న స్త్రీలు ఆమెతో, “భయపడకు, నీకు కుమారుడు పుట్టాడు” అని చెప్పారు, కాని ఆమె జవాబు ఇవ్వలేదు, ఆ మాటలు పట్టించుకోలేదు.
ఆమె దేవుని మందసాన్ని శత్రువులు స్వాధీనం చేసుకున్నారని, తన మామ, తన భర్త చనిపోయారని తెలుసుకొని, “ఇశ్రాయేలీయులలో నుండి మహిమ వెళ్లిపోయింది” అని అంటూ తన కుమారునికి ఈకాబోదు అని పేరు పెట్టింది.
“దేవుని మందసాన్ని శత్రువులు స్వాధీనం చేసుకోవడం వలన, ఇశ్రాయేలీయులలో నుండి మహిమ వెళ్లిపోయింది” అని ఆమె చెప్పింది.