మనష్షే రాజైనప్పుడు అతని వయస్సు పన్నెండేళ్ళు. అతడు యెరూషలేములో యాభై అయిదు సంవత్సరాలు పరిపాలించాడు.
JA
Copywork
Telugu OTSA 2 Chronicles 33장
写経は速く終える入力練習ではなく、一節ずつみ言葉の文と流れを改めて受け止める時間です。入力内容はこのブラウザに一時保存され、ログインするとアカウントにも保存されます。
小見出し単位で進める · 2 Chronicles
అతడు యెహోవా దృష్టికి చెడుగా ప్రవర్తించాడు, ఇశ్రాయేలీయుల ఎదుట నుండి యెహోవా వెళ్లగొట్టిన జనాలు చేసే హేయక్రియలు చేశాడు.
తన తండ్రియైన హిజ్కియా పడగొట్టిన క్షేత్రాలను అతడు తిరిగి కట్టించాడు. బయలు దేవతకు బలిపీఠాలను కట్టించాడు. అషేరా స్తంభాలను నిలిపాడు. అతడు ఆకాశనక్షత్రాలకు మ్రొక్కి వాటిని పూజించాడు.
యెహోవా తన మందిరాన్ని ఉద్దేశించి, “యెరూషలేములో నా పేరు నిత్యం ఉంటుంది” అని చెప్పిన ఆ యెహోవా మందిరంలో అతడు బలిపీఠాలను కట్టించాడు.
యెహోవా మందిరంలో ఉన్న రెండు ఆవరణాల్లో నక్షత్ర సమూహమంతటికి అతడు బలిపీఠాలు కట్టించాడు.
అతడు తన పిల్లలను బెన్ హిన్నోము లోయలో అగ్నిలో బలి ఇచ్చాడు, భవిష్యవాణిని, చేతబడిని ఆచరించాడు, శకునాలను కోరాడు, మృతులతో మాట్లాడేవారిని ఆత్మలతో మాట్లాడేవారిని సంప్రదించాడు. అతడు యెహోవా దృష్టిలో చాలా చెడుగా ప్రవర్తిస్తూ, ఆయనకు కోపం రేపాడు.
అతడు చెక్కించిన విగ్రహాన్ని ఆ ఆలయంలో నిలిపాడు. ఆ ఆలయం గురించి యెహోవా దావీదుకు, అతని కుమారుడైన సొలొమోనుకు, “ఇశ్రాయేలు గోత్రాలన్నిటిలో నేను ఎన్నుకున్న యెరూషలేములో, ఈ దేవాలయంలో నా పేరు నిత్యం ఉంచుతాను.
నేను ఇశ్రాయేలు ప్రజలకు మోషే ద్వారా ఇచ్చిన చట్టాలు, శాసనాలు, నిబంధనలను గురించి నేను వారికి ఆజ్ఞాపించినదంతా జాగ్రత్తగా వారు పాటిస్తే, నేను మీ పూర్వికులకు నియమించిన దేశంలో నుండి ఇశ్రాయేలీయుల పాదాలను తిరిగి వెళ్లనివ్వను” అని చెప్పారు.
కానీ మనష్షే యూదా వారిని, యెరూషలేము ప్రజలను తప్పుదారి పట్టించాడు, కాబట్టి ఇశ్రాయేలీయుల ఎదుట యెహోవా నాశనం చేసిన దేశాల కంటే ఎక్కువ చెడు చేశారు.
యెహోవా మనష్షేతో, అతని ప్రజలతో మాట్లాడారు గాని వారు పెడచెవిని పెట్టారు.
అందువల్ల యెహోవా అష్షూరు రాజు సైన్యాధిపతులను వారి మీదికి రప్పించారు. వారు మనష్షేను బందీగా పట్టుకుని, అతని ముక్కుకు గాలం తగిలించి, ఇత్తడి గొలుసులతో బంధించి బబులోనుకు తీసుకెళ్లారు.
బాధలో అతడు తన పూర్వికుల దేవుని ఎదుట తనను తాను చాలా తగ్గించుకుని తన దేవుడైన యెహోవాను దయచూపమని ప్రాధేయపడ్డాడు.
అతడు ప్రార్థించినప్పుడు యెహోవా అతని విన్నపం ఆలకించి అతని ప్రార్థన అంగీకరించారు. అతడు యెరూషలేముకు అతని రాజ్యానికి తిరిగి వచ్చేలా చేశాడు. అప్పుడు యెహోవాయే దేవుడు అని మనష్షే తెలుసుకున్నాడు.
ఇది జరిగిన తర్వాత మనష్షే లోయలోని గిహోను ఊటకు పడమరగా ఉన్న దావీదు నగర ప్రాకారాన్ని చేప ద్వారం వరకు, ఓఫెలు కొండ చుట్టూ కట్టించాడు. దానిని చాలా ఎత్తు చేయించాడు. యూదాలో కోటగోడలు గల ప్రతి పట్టణంలో అతడు సేనాధిపతులను నియమించాడు.
అతడు యెహోవా మందిరంలో నుండి ఇతర దేవుళ్ళ విగ్రహాలను తొలగించాడు. యెరూషలేములో, యెహోవా మందిర కొండమీద తాను కట్టించిన బలిపీఠాలు తీసివేసి పట్టణం బయట వాటిని పారవేయించాడు.
అప్పుడతడు యెహోవా బలిపీఠాలన్ని మరమ్మత్తు చేయించి, వాటి మీద సమాధానబలులు కృతజ్ఞతార్పణలు అర్పించాడు. ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవాను సేవించమని యూదా వారికి ఆజ్ఞాపించాడు.
అయినా ప్రజలు ఇంకా క్షేత్రాల్లో బలులు అర్పిస్తూనే ఉన్నారు అయితే అవి వారి దేవుడైన యెహోవాకే అర్పించారు.
మనష్షే పరిపాలనకు సంబంధించిన ఇతర విషయాలు, అతడు తన దేవునికి చేసిన ప్రార్థన, ఇశ్రాయేలు ప్రజల దేవుడైన యెహోవా పేరున అతనితో మాట్లాడిన దీర్ఘదర్శి మాటలు, అవన్నీ ఇశ్రాయేలు రాజు గ్రంథంలో వ్రాసి ఉన్నాయి.
అతడు చేసిన ప్రార్థన, దేవుడు అతని విన్నపం ఎలా ఆలకించింది, తనను తగ్గించుకోక ముందు అతడు చేసిన పాపాలు, అతడు చేసిన నమ్మకద్రోహం, కట్టించిన క్షేత్రాలను, అషేరా స్తంభాలను, చెక్కిన విగ్రహాలను గురించి దీర్ఘదర్శులు వ్రాసిన గ్రంథాల్లో ఉన్నాయి.
మనష్షే నిద్రపోయి (చనిపోయి) తన పూర్వికుల దగ్గరకు చేరాడు. అతని పట్టణంలోనే అతన్ని సమాధి చేశారు. అతని స్థానంలో అతని కుమారుడు ఆమోను రాజయ్యాడు.
ఆమోను రాజైనప్పుడు అతని వయస్సు ఇరవై రెండు సంవత్సరాలు. అతడు యెరూషలేములో రెండేళ్ళు పరిపాలించాడు.
అతడు తన తండ్రి మనష్షేలా యెహోవా దృష్టిలో చెడుగా ప్రవర్తించాడు. తన తండ్రి మనష్షే చేయించిన విగ్రహాలన్నిటికి ఆమోను బలులు అర్పిస్తూ పూజిస్తూ ఉండేవాడు.
తన తండ్రి మనష్షేలా ఆమోను యెహోవా ఎదుట తనను తగ్గించుకోలేదు. పైగా అతడు తన దోషాన్ని పెంచుకున్నాడు.
ఆమోను సేవకులు అతని మీద కుట్రపన్ని, తన సొంత భవనంలోనే అతన్ని చంపారు.
అప్పుడు యూదా దేశ ప్రజలు ఆమోను రాజు మీద కుట్రపన్నిన వారినందరిని చంపేశారు, అతని స్థానంలో అతని కుమారుడైన యోషీయాను రాజుగా చేశారు.