దాని తర్వాత యెహోవా వినేలా ప్రజలు తమ కష్టాల గురించి ఫిర్యాదు చేసినప్పుడు, ఆయన అవి వినగానే ఆయన కోపం రగులుకుంది. అప్పుడు యెహోవా నుండి అగ్ని వారి మధ్యకు వచ్చి శిబిరం శివార్లలో కొంత భాగాన్ని దహించివేసింది.
EN
Copywork
Telugu OTSA Numbers 11장
Copywork is not a speed-typing drill but time to re-hold the words and flow of Scripture, one verse at a time. Your input is saved temporarily in this browser, and to your account when you are signed in.
Practice by section · Numbers
ప్రజలు మోషేకు మొరపెట్టగా, అతడు యెహోవాకు ప్రార్థించాడు, ఆ అగ్ని ఆరిపోయింది.
అందుకు ఆ స్థలానికి తబేరా అని పేరు పెట్టారు, ఎందుకంటే యెహోవా నుండి వచ్చిన అగ్ని వారి మధ్యలో వచ్చింది కాబట్టి.
వారితో ఉన్న అల్లరి గుంపు వేరే ఆహారం ఆశించడం ప్రారంభించారు, అప్పుడు మళ్ళీ ఇశ్రాయేలీయులు ఏడ్వడం మొదలుపెట్టి, “మనకు తినడానికి మాంసం మాత్రం ఉంటే ఎంత బాగుండేది!
ఈజిప్టులో చేపలు, దోసకాయలు, పుచ్చకాయలు, ఒక రకమైన ఉల్లిపాయలు, ఉల్లిగడ్డలు, వెల్లుల్లిపాయలు ఉచితంగా తిన్నాము.
కానీ ఇప్పుడు మాకు తిండి మీద ఇష్టం లేకుండ పోయింది; ఈ మన్నా తప్ప మాకేమి కనిపించడం లేదు!” అని అన్నారు.
మన్నా కొత్తిమెర గింజల్లా ఉండి గుగ్గిలంలా కనబడుతుంది.
ప్రజలు బయటకు వెళ్లి, తిరుగుతూ దానిని సేకరించుకొని, దానిని తిరగలితో విసరేవారు లేదా రోటిలో దంచేవారు. కుండలో దానిని ఉడకబెట్టి దానితో రొట్టెలు చేసుకునేవారు. దాని రుచి నూనెతో చేసిన అప్పడంలా ఉంటుంది.
రాత్రివేళ శిబిరంలో మంచు కురిసినప్పుడు మన్నా దాని వెంటనే పడేది.
మోషే ప్రతి కుటుంబంలోని ప్రజలు వారి డేరాల దగ్గర ఏడుస్తూ ఉండడం విన్నాడు. యెహోవా చాలా కోప్పడ్డారు మోషే బాధపడ్డాడు.
మోషే యెహోవాతో, “మీ సేవకునిపై ఈ కష్టం ఎందుకు తెచ్చారు? వీరందరి భారం నా మీద వేయకుండ మీ దృష్టిలో నేనెందుకు దయను పొందలేకపోయాను?
వీరందరిని నేను గర్భందాల్చానా? నేను వీరిని కన్నానా? దాది శిశువును ఎత్తుకున్నట్లు, మీ పూర్వికులకు మీరు ప్రమాణం వాగ్దానం చేసిన స్థలానికి నడిపించడానికి వీరిని నా చేతిలో ఎందుకు మోయమన్నారు?
వీరందరి కోసం మాంసం ఎక్కడ నుండి తేవాలి? నన్ను చూసి, ‘మాకు తినడానికి మాంసం ఇవ్వు!’ అంటూ ఏడుస్తున్నారు.
నా అంతట నేను ఈ ప్రజలందరినీ మోయలేను; భారం నాకు చాల భారీగా ఉంది.
ఒకవేళ నాతో మీరు ఇలా వ్యవహరించ తలిస్తే దయచేసి నన్ను చంపేయండి; నా మీద మీకు దయ కలిగితే నా దురవస్థను నేను చూడకుండ నన్ను చంపేయండి” అని చెప్పాడు.
యెహోవా మోషేతో: “ఇశ్రాయేలు గోత్ర పెద్దలను డెబ్బై మందిని నాయకులుగా, ఎవరైతే పెద్దలుగా ఉన్నవారు నీకు తెలిసినవారిని తీసుకురా. నీతో వారు నిలబడేలా వారు సమావేశ గుడారం దగ్గరకు రావాలి.
నేను దిగివచ్చి నీతో మాట్లాడతాను. నీ మీద ఉన్న ఆత్మ యొక్క శక్తిలో కొద్ది భాగం వారి మీద పెడతాను. వారు నీతో కలిసి ప్రజల భారం పంచుకుంటారు అప్పుడు నీవు ఒంటరిగా మోయనవసరం ఉండదు.
“నీవు ప్రజలకు ఇలా చెప్పు: ‘రేపటి కోసం మిమ్మల్ని మీరు పవిత్రం చేసుకోండి, రేపు మీరు మాంసం తినబోతున్నారు. మీరు, “మాకు మాంసం మాత్రం ఉంటే బాగుండేది! ఈజిప్టులో మాకు బాగుండేది!” అని ఏడ్వడం యెహోవా విన్నారు కాబట్టి యెహోవా మీకు మాంసం ఇస్తారు, మీరు తింటారు.
దానిని మీరు తినడం ఒక రోజు కాదు, రెండు రోజులు, అయిదు రోజులు, పది రోజులు, యిరవై రోజులు కాదు,
ఒక నెలంతా మీ నాసికా రంధ్రాల నుండి బయటకు వచ్చి మీరు అసహ్యించుకునే వరకు తింటారు; ఎందుకంటే మీరు మీ మధ్య ఉన్న యెహోవాను నిరాకరించి, “మేము అసలు ఈజిప్టును ఎందుకు విడిచిపెట్టామో?” అంటూ ఆయన ఎదుట ఏడ్చారు.’ ”
అయితే మోషే, “నేను ఆరు లక్షలమంది పాదాచారుల మధ్య ఉన్నాను, మీరేమో, ‘నేను వారికి నెలరోజులు తినడానికి సరిపడే మాంసం ఇస్తాను!’ అని అన్నారు.
ఉన్న పశువులు, మందలు అన్నిటిని వధించినా వీరికి సరిపోతుందా? సముద్రంలో చేపలన్నీ పట్టినా వీరికి సరిపోతాయా?”
యెహోవా మోషేకు జవాబిస్తూ, “యెహోవా బాహుబలం తక్కువయ్యిందా? నేను చెప్పింది జరుగుతుందో లేదో నీవు చూస్తావు” అని అన్నారు.
మోషే బయటకు వెళ్లి యెహోవా చెప్పిందంతా ప్రజలకు తెలియజేశాడు. డెబ్బైమంది గోత్ర పెద్దలను తెచ్చి మందిరం చుట్టూ నిలబెట్టాడు.
అప్పుడు యెహోవా మేఘంలో దిగివచ్చి అతనితో మాట్లాడారు. అతనిపై ఉన్న ఆత్మ శక్తిలో కొంత ఆ డెబ్బై గోత్ర పెద్దలపై ఉంచినప్పుడు ఆత్మ వారిమీద నిలిచి వారు ప్రవచించారు అయితే, తర్వాత ఎన్నడు ప్రవచించలేదు.
అయితే, ఇద్దరు, శిబిరంలోనే ఉండిపోయారు. వారి పేర్లు ఎల్దాదు, మేదాదు. వారు గోత్ర పెద్దలలో ఉన్నవారే, కానీ గుడారం బయటకు వెళ్లలేదు. అయినప్పటికీ ఆత్మ వారి మీద ఉంది, వారు శిబిరంలో ప్రవచించారు.
ఒక యువకుడు మోషే దగ్గరకు పరిగెత్తుకుంటూ వచ్చి, “ఎల్దాదు, మేదాదు శిబిరంలో ప్రవచిస్తున్నారు” అని చెప్పాడు.
నూను కుమారుడైన యెహోషువ, యవ్వనకాలం నుండి మోషే దగ్గరే ఉన్నవాడు, అతడు మాట్లాడుతూ, “మోషే, నా ప్రభువా, వారిని ఆపండి!” అని అన్నాడు.
కానీ మోషే అతనితో, “నా పక్షంగా నీవు అసూయపడుతున్నావా? నేనైతే యెహోవా ప్రజలంతా ప్రవక్తలు కావాలని, యెహోవా తన ఆత్మ వారందరి మీద ఉంచాలని కోరతాను!” అని జవాబిచ్చాడు.
తర్వాత మోషే, ఇశ్రాయేలు గోత్ర పెద్దలు, శిబిరానికి తిరిగి వెళ్లారు.
తర్వాత యెహోవా దగ్గరి నుండి గాలి వెళ్లి సముద్రం దిక్కునుండి పూరేళ్ళను తీసుకువచ్చింది. అది వాటిని రెండు మూరల ఎత్తుగా, ఏ దిశలోనైనా ఒక రోజు నడకంత దూరంగా శిబిరం చుట్టూరా చెదరగొట్టింది.
ఆ దినమంతా, రాత్రంతా, మరుసటి రోజంతా, ప్రజలు బయటకు వెళ్లి పూరేళ్ళను సమకూర్చుకున్నారు. ఏ ఒక్కరు కూడా పది హోమెర్ల కంటే తక్కువ పోగు చేసుకోలేదు. వాటిని శిబిరం చుట్టూ పరిచారు.
అయితే, మాంసం పళ్ళ సందుల్లో ఉండగానే దానిని నమిలి మ్రింగకముందే, యెహోవా కోపం వారిపై రగులుకుంది, ఆయన వారిని భయంకరమైన తెగులుతో మొత్తారు.
ఆ స్థలంలో ఇతర ఆహారం కోసం ఆశపడిన వారిని పాతిపెట్టినందుకు ఆ స్థలానికి కిబ్రోతు హత్తావా అనే పేరు పెట్టారు.
ప్రజలు కిబ్రోతు హత్తావా నుండి హజేరోతుకు ప్రయాణం చేసి అక్కడే ఉండిపోయారు.