రాజు అబ్షాలోము మీద మనస్సు పెట్టుకున్నాడని సెరూయా కుమారుడైన యోవాబు గ్రహించాడు.
JA
Copywork
Telugu OTSA 2 Samuel 14장
写経は速く終える入力練習ではなく、一節ずつみ言葉の文と流れを改めて受け止める時間です。入力内容はこのブラウザに一時保存され、ログインするとアカウントにも保存されます。
小見出し単位で進める · 2 Samuel
కాబట్టి యోవాబు తెకోవాకు ఒకరిని పంపించి అక్కడినుండి ఒక తెలివైన స్త్రీని తెప్పించాడు. అతడు ఆమెతో, “నీవు దుఃఖంలో ఉన్నట్లు నటించు, దుఃఖ వస్త్రాలను ధరించు, ఎలాంటి సౌందర్య అలంకరణలను ఉపయోగించవద్దు. చనిపోయినవారి కోసం దుఃఖిస్తూ చాలా రోజులు గడిపిన స్త్రీలా నటించు.
రాజు దగ్గరకు వెళ్లి అతనితో ఈ మాటలు చెప్పు” అని చెప్పి ఏమి మాట్లాడాలో యోవాబు ఆమెకు నేర్పాడు.
ఆ తెకోవా స్త్రీ రాజు దగ్గరకు వెళ్లి తన తల నేలకు ఆనించి నమస్కారం చేసి, “ఓ రాజా! నాకు సహాయం చేయండి!” అని వేడుకొంది.
“నీకు వచ్చిన కష్టం ఏంటి?” అని రాజు ఆమెను అడిగాడు.
నీ సేవకురాలినైన నాకు ఇద్దరు కుమారులు. వారు పొలంలో ఒకరితో ఒకరు పోట్లాడుకున్నారు. వారిని వేరు చేయడానికి అక్కడ ఎవరూ లేకపోవడంతో ఒకడు ఇంకొకడిని కొట్టి చంపేశాడు.
ఇప్పుడు నా కుటుంబమంతా నీ సేవకురాలినైన నా మీదికి లేచి, ‘తన సోదరుని కొట్టి చంపినవాన్ని మాకు అప్పగించు. వాడు తన సోదరుని చంపాడు కాబట్టి మేము వాన్ని చంపాలి: అప్పుడు వారసుడే లేకుండ పోతాడు’ అని వారు అంటున్నారు. వారు నా భర్త పేరును గాని వారసులను గాని భూమి మీద మిగలకుండా, నా దగ్గర మిగిలి ఉన్న ఏకైక మండే బొగ్గును చల్లార్చాలని చూస్తున్నారు” అని చెప్పింది.
అందుకు రాజు, “నీవు ఇంటికి వెళ్లు, నీ గురించి నేను ఆజ్ఞ ఇస్తాను” అని ఆమెతో చెప్పాడు.
అప్పుడు తెకోవా స్త్రీ, “నా ప్రభువైన రాజు నన్ను నా కుటుంబాన్ని క్షమించును గాక, రాజు, వారి సింహాసనం నిర్దోషంగా ఉండును గాక” అని రాజుతో చెప్పింది.
అందుకు రాజు, “ఎవరైనా దీని గురించి నిన్ను ఏమైనా అంటే వారిని నా దగ్గరకు తీసుకురా, వారు మరలా నిన్ను ఇబ్బంది పెట్టరు” అన్నాడు.
ఆమె, “అయితే, రక్తానికి ప్రతీకారం తీర్చుకునేవాడు ఇంకెక్కువ నాశనం చేయకుండా నిరోధించడానికి రాజు తన దేవున్ని ప్రార్థించాలి, తద్వార నా కుమారుడు నాశనానికి గురి కాకుండా ఉంటాడు” అని చెప్పింది.
అప్పుడు ఆమె, “నా ప్రభువైన రాజుతో మీ సేవకురాలినైన నన్ను ఒక మాట చెప్పనివ్వండి” అన్నాడు.
ఆ స్త్రీ ఇలా చెప్పింది, “మీరు దేవుని ప్రజలకు వ్యతిరేకంగా ఇలాంటి పని ఎందుకు చేశారు? రాజు ఇలా చెప్పినప్పుడు, బహిష్కరించబడిన తన కుమారున్ని రాజు తిరిగి తీసుకురాలేదు కాబట్టి తాను దోషి కావడం లేదా?
మనమందరం చనిపోతాం గదా. ఒకసారి నేల మీద ఒలికిన తర్వాత మరలా ఎత్తలేని నీళ్లలా ఉన్నాము. అయితే దేవుడు కోరుకునేది ఇది కాదు; వెలివేయబడినవారు తన దగ్గరకు తిరిగి రావడానికి ఆయన మార్గాలు ఏర్పరుస్తారు.
“నా ప్రజలు నన్ను భయపెట్టారు కాబట్టి నేను నా ప్రభువైన రాజుకు దీని గురించి చెప్పడానికి వచ్చాను. నీ సేవకురాలు ఏమనుకుందంటే, ‘నేను రాజుతో మాట్లాడతాను. ఆయన తన సేవకురాలి మనవిని వింటారు.
రాజు నా మనవి అంగీకరించి, దేవుడిచ్చిన వారసత్వాన్ని నేను, నా ఇద్దరు కుమారులు అనుభవించకుండ మమ్మల్ని నాశనం చేయడానికి ప్రయత్నించేవారి చేతిలో నుండి నన్ను విడిపించడానికి ఒప్పుకుంటాడు.’
“నీ సేవకురాలినైన నేను చెప్పేది ఏంటంటే, ‘మంచి చెడులను విచారించడంలో నా ప్రభువైన రాజు దేవుని దూతవంటివాడు కాబట్టి నా ప్రభువైన రాజు మాట నా వారసత్వాన్ని కాపాడును గాక. నీ దేవుడైన యెహోవా నీకు తోడుగా ఉండును గాక’ ” అని చెప్పింది.
అప్పుడు రాజు ఆమెతో, “నేను నిన్ను ఒక విషయం అడుగుతాను. ఏదీ దాచకుండా చెప్పాలి” అన్నాడు.
రాజు, “దీనంతటి వెనకాల యోవాబు హస్తమేమైన ఉందా?” అని అడిగాడు.
ప్రస్తుత పరిస్థితులను మార్చడానికి మీ సేవకుడైన యోవాబు ఇలా చేశాడు. దేశంలో జరుగుతున్నదంతా తెలుసుకోవడానికి నా ప్రభువుకు దేవుని దూతవంటి జ్ఞానం ఉన్నది” అన్నది.
అప్పుడు రాజు యోవాబుతో, “సరే, నీ విన్నపం ప్రకారం నేను చేస్తాను. నీవు వెళ్లి, యువకుడైన అబ్షాలోమును తీసుకురా” అన్నాడు.
యోవాబు తన తల నేలకు ఆనించి నమస్కారం చేసి రాజును దీవిస్తూ ఇలా అన్నాడు, “నా ప్రభువైన రాజా! నీవు నీ సేవకుడైన నా మనవి అంగీకరించావు కాబట్టి నా ప్రభువైన రాజు దృష్టిలో నీ సేవకుడనైన నేను దయ పొందానని ఈ రోజు నాకు తెలిసింది.”
అప్పుడు యోవాబు గెషూరు వెళ్లి అబ్షాలోమును యెరూషలేముకు తీసుకువచ్చాడు.
అయితే రాజు, “అతడు తన ఇంటికి వెళ్లాలి; అతడు నా ముఖాన్ని చూడకూడదు” అన్నాడు కాబట్టి అబ్షాలోము రాజు ముఖాన్ని చూడకుండ తన సొంత ఇంటికి వెళ్లాడు.
ఇశ్రాయేలీయులందరిలో అబ్షాలోము వంటి అందమైనవారు ఇంకెవరు లేరు. అరికాలు నుండి నడినెత్తి వరకు అతనిలో ఏ లోపం లేదు.
అతని తలవెంట్రుకలు చాలా భారంగా ఉండడంతో సంవత్సరానికి ఒకసారి తన తలవెంట్రుకలు కత్తిరించేవాడు. వాటి తూకం రాజు ఆమోదించిన తూనిక ప్రకారం రెండువందల షెకెళ్ళు ఉండేది.
అబ్షాలోముకు ముగ్గురు కుమారులు ఒక కుమార్తె పుట్టారు. అతని కుమార్తె పేరు తామారు. ఆమె చాలా అందమైనది.
రాజు ముఖాన్ని చూడకుండ అబ్షాలోము రెండు సంవత్సరాలు యెరూషలేములో నివసించాడు.
అప్పుడు యోవాబును రాజు దగ్గరకు పంపించాలని అబ్షాలోము అతన్ని పిలిచాడు కాని యోవాబు అతని దగ్గరకు రావడానికి ఒప్పుకోలేదు. అతన్ని రెండవసారి పిలిచినా సరే యోవాబు రావడానికి ఒప్పుకోలేదు.
అప్పుడు అబ్షాలోము తన సేవకులతో, “చూడండి, యోవాబు పొలం నా పొలం ప్రక్కనే ఉంది, అతని పొలంలో యవల పంట ఉంది. మీరు వెళ్లి దానిని తగలబెట్టండి” అన్నాడు. కాబట్టి అబ్షాలోము పనివారు ఆ పొలాన్ని తగలబెట్టారు.
అప్పుడు యోవాబు అబ్షాలోము ఇంటికి వెళ్లి, “నీ పనివారు నా పొలాన్ని ఎందుకు తగలబెట్టారు?” అని అడిగాడు.
అందుకు అబ్షాలోము యోవాబుతో, “నీవు రావాలని నేను కబురు పంపాను. ‘గెషూరు నుండి నేను ఎందుకు వచ్చాను? నేనక్కడే ఉండడం నాకు మంచిది గదా!’ అని నీ చేత రాజుతో చెప్పించడానికి నిన్ను రాజు దగ్గరకు పంపాలని నిన్ను పిలిచాను. నేను రాజు ముఖాన్ని చూడాలి. నేను దోషినైతే రాజు నన్ను చంపించవచ్చు” అన్నాడు.
కాబట్టి యోవాబు రాజు దగ్గరకు వెళ్లి ఆ సంగతి చెప్పాడు. అప్పుడు రాజు అబ్షాలోమును పిలిపించగా అతడు రాజు దగ్గరకు వచ్చి తన తల నేలకు ఆనించి రాజుకు నమస్కారం చేశాడు. రాజు అబ్షాలోమును ముద్దు పెట్టుకున్నాడు.